Wednesday, December 18, 2013

Sri Subramanyeswara Temple-Mopidevi,శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం-మోపిదేవి




  •  

దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో ప్రస్తావించబడిన ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు ...

అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలో కి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపో యాయి. ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమ హర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమ హర్షికి, విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంత మైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వ తం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిం చింది. తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.‘వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్‌ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్‌’ అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండమ్యడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.కుమారస్వామి ఉరగ (పాము) రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరిం చారు అగస్య్త మహర్షి. సనక, సనకస, సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు.

వారు ఒక పర్యా యం పరమేశ్వర దర్శ నానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ, స్వాహా మొదలైన దేవతాస్ర్తీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీదేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘కుమారా! ఏల నవ్వుచున్నావు? వారు నేనులా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రివలే లేరా? భేదమేమైననూ కన్పించినదా?’’ అని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభించాడు.

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ‘అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్‌’ అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఇతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు.

తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారుచేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు.అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి gaa స్ధిరపడిందని చెపుతారు.

క్షేత్ర విశిష్టత...
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధ వ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

విశేష పూజలు...
నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.

ఇలా వెళ్ళాలి...
కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపిదేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె.

Courtesy with : Sunday magazine@surya Telugu daily 14-June-2013
  • =========================
visit my website : Dr.Seshagirirao.com

4 comments:

  1. god is great నాగవల్లిచేట్టు చలాబాగుంది ఇక్కడికి రావడం నా అద్రుష్టం .

    ReplyDelete
    Replies
    1. ఈ గుడి కి ట్రావెల్ బస్సు వెళ్లాడనికి దారి ఉందా..
      బస్సు గుడి వరకు వెళ్తుందా చెప్పండి దయచేసి

      Delete
  2. ఊయలలో వెయ్యిాలి అంటే ఏమి చేయవలెను.

    ReplyDelete