Thursday, December 19, 2013

Bhadrakali Temple Warangal,కాకతీయుల ఇలవేల్పు.శ్రీ భద్రకాళి-వరంగల్

  •  

  •  


వరంగల్‌-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలి టెక్నిక్‌ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన... గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంత మైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది భద్రకాళీ అమ్మవారు. ఈ దేవాలయంలో దేవివిగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండు వగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రేతా సనాసీనయై ఉన్నది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, ఛురిక, జపమాల, డమరుకం... ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ధరించి... 8 చేతులతో... అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్న భద్రకాళి అమ్మవారి విశేషాలు

కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగార మై వారి కోర్కెలను తీరుస్తూ ఉన్నట్లు... ‘పతాపరుద్ర చరిత్రము’, ‘సిద్ధేశ్వర చరిత్రము’ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏ కశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న వి ద్వాంసులు అతనిని అవమానపరచి పంపివే శారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ వి ద్వాంసులను ఎలాగైనా జయించాలనే ఉద్దేశం తో ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా? అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకం టే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీక రించినట్లు అవుతుంది.

కాదంటేనే అతనిని ఓ డించినట్లవుతుంది అని నిర్ణయించి, రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండిది. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసుల లో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సు దర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివా డు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు స్పష్టమవుతుంది.

క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీ కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీ.శ. 1950 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్‌ శాస్ర్తి, స్థానిక శ్రీవైష్ణవ పండితులు శ్రీమాన్‌ ముడుంబైరామానుజా చార్య నగరంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి మగన్‌లాల్‌ సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు.

అదే రాత్రి శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారికి అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట...మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మ వారిని దర్శిం చి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునురుద్దరణకు నావంతు సహకారం అందిస్తానని శాస్ర్తి గారికి మాట ఇవ్వగా శ్రీ గణేశ శాస్ర్తి గారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది.

అమ్మవారికి మహిమకు ముగ్ధుడైన శ్రీమగన్‌లాల్‌ సమేజా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. ఆ సందర్బంలో ఆయనకు శ్రీ విద్యా నిధియైన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి, తాండ్ర వెంకటరామనర్సయ్య, అడ్లూరి సీతారామశాస్ర్తి, వంగల గురువయ్య, టంకసాల నరసింహారావు, మహాతపస్వి ని మంగళాంబిక ఇలా ఎంతోమంది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం.

ఆలయ నిర్మాణ విశేషాలు...
శ్రీ భద్రకాళీ దేవాలయము క్రీ.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆ లయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి నట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్రాకారం లో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈదేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ.

అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖ ద్వారం అన్నీ కాక తీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపి స్తుంది. అంతేకాక దేవాలయంలోని అంతరాళ స్తంభాలలో ఒకదాని మీద... ‘మహేశశ్చారు సంధత్తే మార్గణం కొనకా చలే! మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచల మ్‌!!’ అనే శ్లోకం కన్పిస్తుంది. ఈ శాసనపాఠం పురాతత్త్వ శాఖ వారు ప్రచురించిన వరంగల్‌ జిల్లా శాసనాల్లో (పు.307) ఉన్నది. ఈ శ్లోకం లోని ఎఱ్ఱన క్రీ.శ.10వ శతాబ్దిలో కాకతిపురాన్ని పాలించి నట్లు గూడూరు శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఈయన తండ్రి విఠనామాత్యు డని, ఆయనకు మీసరగండడనే బిరుదు ఉండేదని ఈ శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఇదే విషయం దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉన్నది.

అది ‘మంత్రిమీసర గండేన, విఠనామాత్య సూను నా! ఎరయాఖ్యేన సమోదాతా, న భూ తోన్‌ భవిష్యతి!!’ అనే శ్లోకం. ఈ రెండు స్తంభశాస నాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో నిర్మింప బడి ఉంటుందని ఊ హించవచ్చు. లేదా కాకతి ప్రతాపరుద్రుని సర్వసైన్యాధిపతియైన ఆడిదం మల్లుకు కూడా మీసరగండడనే బిరుదు కన్పిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింబడిందో సరిగ్గా చెప్పలేం. ఏమైనప్పటికీ కనీసం వెయ్యు సంవత్సరాల చరిత్రగలది ఈ శ్రీ భద్రకాళీ దేవాలయం.

1950లో పునరుద్ధరించే సమయం వరకూ అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రా చీనకాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదనటానికి - తనరు భద్రేశ్వరి యనంగ భయదంబుగాగ - అన్న సిద్ద్శ్వరచరిత్ర (పు.24) లోని మాటలే నిదర్శనం! అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. (దక్షిణాచార సంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి). అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.

గర్భాలయానికి రెండువైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి. ఆవి బహుశా యోగులో సిద్ధులో తపస్సు చేసుకోటానికి ఉపయోగించే వేమో అనిపిస్తుంది. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉన్నది. అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి. అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో, చెఱవు ప్రక్కన ఉన్న ఒక పెద్ద కొండమీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది. 1966లో వరంగల్‌-ఖాజీపేట ప్రధాన రహదారిగుండా శ్రీ భద్రకాళీ దేవాలయానికి బీటీ రోడ్డు, వీది దీపాలు ఏర్పాటు చేయబడినాయి. ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ స్థపతి పద్మశ్రీ గణపతి స్థపతి గారి నేతృ త్వంలో దక్షిణభారత దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం, మహా మండపం, శాలాహారదులు నిర్మించారు.

భద్రకాళీ చెఱువు...
ఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెఱవు ఒకటి ఉన్నది. దానినే భద్రకాళీ చెఱవు అంటారు. వరంగల్‌ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెఱవు నుండే జరుగుతుంది.

ఇతర ఆలయాలు...
మహామండపంలో దక్షిణంవైపున ఒక శిలమీద చెక్కిన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భద్రకాళీ అమ్మవారు ఉన్న భూమియలముతో సమానంగా ఉండటం వలన ఇవి కూడా ప్రాచీనకాలపువే అనిపిస్తుంది. అదీకాక, ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో కాక పార్వతీపరమేశ్వరుల రూపంలో ఉండటం ఇక్కడి విశేషం. శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమామహాశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి. ఆలయ ముందుభాగంలో మహామండపం ఒకటి నిర్మించారు. అందులో ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం, సుబ్రహ్మణేశ్వరుడు, ఆంజనేయస్వామి ప్రతిష్ఠలు ఉన్నాయి.

ఆగమ సంస్కృత విద్యాలయం...
వైదిక ధర్మోద్ధరణ ధ్యేయంగా షడంగాలతో కూడిన వేద విద్యాలయాన్ని (శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయం) ఆలయ ప్రాంగణంలో కొన్నేళ్ళ క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నెలకొల్పారు. ప్రకృతి రమణీయతతో బాటు నిరంతరం వేద ఘోషతో దేవాలయ ప్రాMగణం దర్శింప వచ్చిన భక్తులకు ఒక అనిర్వచనీయమైన దివ్యానుభూతిని కలిగిస్తోంది.


Courtesy with : Sunday magazine@surya Telugu daily 21-10-2012

*=================================*
 * Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment