Saturday, June 6, 2015

Janardhana swamy temple Dhavaleswaram,జనార్దనస్వామి ఆలయం ధవళేశ్వరం

  •  

  • Janardhana swamy temple Dhavaleswaram,జనార్దనస్వామి ఆలయం ధవళేశ్వరం

రాజమండ్రికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జనార్దనస్వామి ఆలయానికి సంబంధించి ఎన్నో ఐతిహ్యాలూ పురాణగాథలూ! స్వామిని సాక్షాత్తూ నారద మహర్షే కొలిచాడంటారు. నదీమతల్లి గోదావరి జనార్దనుని సేవకే అవతరించిందంటారు.

భూమ్మీద వెలసిన తొలి వైష్ణవాలయం ధవళేశ్వరంలోని జనార్దనస్వామి దేవాలయమేనంటాయి పురాణాలు. నారదమహర్షి స్వహస్తాలతో జనార్దనుడికి పూజలు నిర్వహించాడని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు ఇక్కడికొచ్చి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడని కూడా పురాణగాథ. ఒకానొక సందర్భంలో నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని 'పితృదేవా! భక్తితో కొలిచిన వెంటనే, కోర్కెలు తీర్చే క్షేత్రం ఏది?' అని అడిగాడట. అందుకు బ్రహ్మదేవుడు 'గౌతమీనదికి ఉత్తరదిశలో ఆప్రాంతం ఉంది. అది జనార్దన క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. ఆదిలో నా నాలుగు ముఖాల నుంచీ నాలుగు వేదాలూ కోటిసూర్య ప్రచండ కాంతులతో బయటకు వచ్చాయి. మహర్షులూ దేవతలూ ఆ వేద కాంతినీ, కాంతి కారణంగా ఉద్భవించిన వేడినీ తట్టుకోలేక శ్రీమన్నారాయణుడిని ప్రార్థించారు. అప్పుడే, దేవదేవుడైన నారాయణుడు వేయిబాహువులతో వేదాల్ని ఒడిసి పట్టుకుని, భూమిపై ఒక పర్వతంగా నిలిపాడు. ఆ వేదరాశియే జనార్దన పర్వతంగా ఏర్పడింది' అని చెప్పాడు.

 స్థల పురాణం.-వేదాలు వెలసిన కొండ...
పురాణ గాథల ప్రకారం...వ్యాస మహర్షి వేదాల అంతరార్థం తెలుపమంటూ ఘోరతపస్సు చేశాడు. జనార్దనుడు ప్రత్యక్షమై ఈ పర్వతం నుంచి నాలుగు పిడికిళ్ల మట్టిని తీసి వ్యాసుడికి అందించాడు. అతను వాటిని చతుర్వేదాలుగా విభజించాడు. అవే రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంగా వెలుగులోకి వచ్చాయి. కృతయుగంలో ఏర్పడిన ఈకొండ మీద తూర్పుచాళుక్యుల కాలంలో పూర్తి స్థాయిలో జనార్దనుడి ఆలయాన్ని నిర్మించారు.


భూదేవీ శ్రీదేవీ సమేతంగా...
గోదావరి సమీపంలో ఎత్త్తెన కొండ మీద నిర్మించిన ఆలయం... ఆధ్యాత్మిక తేజస్సుతో విరాజిల్లుతోంది. జనార్దనుడు ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమిస్తాడు. భువి మీదున్న 108 వైష్ణవాలయాలలో ఇదే ప్రథమమని బ్రహ్మదేవుడే చెప్పాడంటాయి పురాణాలు. ఈకొండ మీదే, ఓ గుహలో సంతాన గోపాలస్వామి వెలిశాడు. సంతానంలేని దంపతులు స్వామిని కొలిస్తే... పండంటి పిల్లలు పుడతారని ఓ నమ్మకం. త్రేతాయుగంలో శ్రీరాముడు జనార్దనస్వామిని దర్శించుకున్నాడట. రావణుడిని చంపాక... బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోడానికి ఈ క్షేత్రానికి వచ్చాడని ఐతిహ్యం. తన వెంట వచ్చిన ఆంజనేయుడిని ఈ ప్రాంతానికి రక్షకుడిగా ఉండమని ఆదేశించాడట శ్రీరాముడు. కాబట్టే, క్షేత్రపాలకునిగా మారుతి పూజలందుకుంటున్నాడు. 'నిన్ను వదలి ఉండలేను స్వామీ!' అని వేడుకున్న హనుమ కోసం తన పాదముద్రల్ని వదిలి వెళ్లాడు సీతారాముడు. శ్రీరాముని పాదాలు తాకిన ప్రదేశం కావటంతో రామపాదక్షేత్రంగానూ పిలుస్తారు.

గోదావరి జన్మస్థలి...
జనార్దన స్వామి అభిషేకం కోసమే గోదావరి పుట్టిందని పురాణ కథ. కృతయుగంలో నారదమహర్షి...సొరంగ మార్గం ద్వారా కాశీ వెళ్లి గంగాజలాన్ని తెచ్చి జనార్దనుడికి అభిషేకించేవాడట. 'నేనైతే మంత్రశక్తితో అంతదూరం వెళ్లి గంగాజలం తెస్తున్నా. కలియుగంలో పరిస్థితి ఏమిటి? స్వామివారి అభిషేకం ఎలా జరుగుతుంది?' అని ఆలోచించాడు. ఆ కార్యాన్ని గౌతముడి ద్వారా పూర్తిచేయాలని సంకల్పించాడు. ఆ సమయానికి గౌతముడు కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద తపస్సు చేసుకుంటున్నాడు. ఆరోజుల్లో పంటలు సరిగా పండక ప్రజలు దుర్భర దారిద్య్రాన్ని అనుభవించేవారు. గౌతముడు తన తపశ్శక్తితో ధాన్యాన్ని పండించి, ప్రజలకు నిత్యం అన్నదానం చేసేవాడట. నారదుడు తన చాతుర్యంతో, ఒకరోజు ఆయన సృష్టించిన పంటను గోవు తినేలా చేశాడు. అన్నదానానికి ఉపయోగించే ధాన్యాన్ని గోవు తినేసిందనే బాధతో, గౌతమ మహర్షి దర్భతో గోవును అదిలించాడు. ఆమాత్రానికే ఆ గోమాత చనిపోవటంతో గోహత్యా పాతక నివృత్తి కోసం గౌతముడు ఘోరతపస్సు ఆచరించి భువిపైకి గంగను రప్పించాడు. గోవు నడిచిన ప్రదేశంలో గంగ పుట్టటంతో ఆప్రాంతానికి గోదావరిగా నామకరణం చేశాడు. ఆ గోదావరి జలంతోనే జనార్దనుడికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తారు.


ఘనంగా రథోత్సవం
భీష్మ ఏకాదశి రోజున జనార్దన క్షేత్రంలో భవంగా రథోత్సవం జరుగుతుంది. కార్తీక, ధనుర్మాసాల్లో ప్రత్యేక పూజలూ వ్రతాలూ నిర్వహిస్తారు. మిగతా రోజుల్లోనూ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఉదయాస్తమాన పూజలు నిర్వహిస్తారు. కొండపైకి వెళ్లేదారంతా శ్రీమహావిష్ణు స్వరూపంగా కొలుస్తారు భక్తాదులు. రాజమండ్రి నుంచి బస్సులూ ఆటోలూ పుష్కలంగా ఉంటాయి.

- సూర్యకుమారి, న్యూస్‌టుడే, రాజమండ్రి

  • *=================================* 
* Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment