Sunday, June 7, 2015

నరసింహుడు తాతయ్యాడు,Narasimhaswami temple Singarayakonda









మీన కూర్మ వరాహావతారాల తరువాత తనేసర్వం అని ప్రార్థించిన భక్తుని కోసం మహా విష్ణువు నరమృగ అవతారాన్ని ఎత్తాడు. ఆయన్నే నారసింహుడనీ పిలుస్తాం. అయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మాత్రం ఆయనకు తాతయ్య అన్న బిరుదు కూడా ఉంది. అదెలా వచ్చిందో... మనమూ తెలుసుకుందాం!
ఒకవైపు మహోగ్ర రూపం.. మరోవైపు ప్రసన్న వదనం... ఓ పక్క లక్ష్మీ నారసింహుడు, మరో పక్క యోగ నారసింహుడు... ఇలా ఒకే క్షేత్రంలో రెండు గర్భగుడుల్లో స్వామి భక్తులకు కొంగు బంగారంగా అలరారుతున్న దివ్యక్షేత్రం ప్రకాశంజిల్లాలోని సింగరాయకొండ. ద్వాదశ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి పొందింది. సింగరాయకొండ పట్టణంలోని ఓ కొండమీద వెలసిన ఈ క్షేత్రపు ప్రధాన ప్రాంగణంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన వరాహ లక్ష్మీనరసింహస్వామి రాజ్యలక్ష్మి, గోదాదేవి సమేతంగా కొలువై ఉంటాడు. అదే దేవాలయపు తూర్పుభాగంలో తాతగుడిలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి వెలసి ఉంటాడు. పర్ణశాలలో దేవరుషి నారద మహాముని తపమాచరించి నృసింహ స్వామిని ప్రసన్నం చేసుకోగా- ఆయన కోరిక మేరకే యోగానంద నరసింహస్వామిగా సింగరాయకొండలో వెలిశాడని ప్రతీతి. యోగ ముద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు.
తాతగుడిగా...
కారడవిలో వెలసిన నరసింహస్వామికి గతంలో రెండు కిలోమీటర్ల దూరంలోని సోమరాజుపల్లి నుంచి అర్చకుడు వెళ్లి నిత్యం నైవేద్యం సమర్పించి వచ్చేవాడు. ఒకనాడు ఆయన అర్చన నిమిత్తం వెళుతూ తన ఆరేళ్ల పిల్లాడిని కూడా గుడికి తీసుకువెళ్లాడు. ఆ బాలుడు ఆడుకుంటుండగా- నైవేద్యం పెట్టిన అర్చకుడు బిడ్డను మరచి ఆలయ తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. తరువాత గుర్తుకు వచ్చినా ఆ కారడవి ప్రాంతానికి రాత్రి పూట వెళ్లలేక పొద్దున్నే వెళ్లాడు. బిడ్డను ఏ క్రూరమృగాలో తినేసి ఉంటాయని అనుకుంటూ గుడి తలుపులు తీసిన అర్చకుడికి బిడ్డ ఆడుకుంటూ కనిపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన అర్చకుడు బిడ్డను అక్కున చేర్చుకుని ఆరా తీయగా- గుడిలోని తాత అన్నం పెడితే తిని ఆడుకుంటున్నానని చెప్పాడు. అలా నాటి నుంచీ యోగ నరసింహస్వామిని తాత నారసింహస్వామిగా పిలుస్తున్నారు.
స్వామి వెలసిన ప్రాంతం ఒకప్పుడు కారడవి. ఇక్కడ కరాటి రాజ్యం ఖరదూషణాదుల పాలనలో సాగేది. ఖరాసురుడు నరసింహస్వామి భక్తుడు. అహోబిలం నుంచి వచ్చి స్వామిని దర్శించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలోనే ఖరాసురుడు స్వామిని వరం కోరగా.. శ్రీరామచంద్రుని రూపంలో కటాక్షిస్తానని అభయమిచ్చాడు. దానికి మనస్తాపం చెందిన ఖరాసురుడు యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగించడం మొదలు పెట్టాడు. తర్వాత వనవాస కాలంలో రుషి ఆశ్రమాల రక్షణ నిమిత్తం రామచంద్రుడు కరాటి రాజ్యం చేరాడు. ఖరుడు నరసింహ భక్తుడు కావడంతో శ్రీరామచంద్రుడు యోగనిద్రలో నృసింహ తేజం పొంది వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్ఠించి, అనంతరం ఖరదూషణాదులను వధించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
స్వామికి జ్యేష్ఠమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

- కోనేటి సురేష్‌బాబు, ఈనాడు, ఒంగోలు--ఫొటోలు: నూకసాని శ్రీనివాసులు

  • *=================================* 

* Visit my website : Dr.Seshagirirao.com _ 

No comments:

Post a Comment